ఇక ఇంటింటికీ ‘దిశ’
అమరావతి (ప్రశ్న న్యూస్) తాడేపల్లిలో యువతిపై సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై సీరియస్గా స్పందించిన సీఎం వైఎస్ జగన్ మహిళా భద్రతకు సంబంధించి అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ సవాంగ్తో సహా పలువురు సీనియర్ పోలీసు అధికారులతో ఆయన చర్చించారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. మహిళా భద్రత కోసం రూపొందించిన దిశ యాప్ వినియోగంపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు.దిశ యాప్ వినియోగంపై అక్కాచెల్లెమ్మలకు అవగాహన పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలని జగన్ ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా చూడాలని ఆయన సూచించారు. అందుకోసం సచివాలయాల్లోని మహిళా పోలీసులు, వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని.. వారి ద్వారా అక్కాచెల్లెమ్మలకు దిశ యాప్పై అవగాహన కల్పించాలన్నారు. దిశ యాప్ డ్రైవ్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదకర పరిస్థితుల్లో యాప్ని ఎలా వినియోగించాలనే విషయాన్ని కాలేజీ, విద్యాసంస్థల్లో విద్యార్థినులకు కూడా అవగాహన కల్పించాలని చెప్పారు. అలాగే ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ సాయం అందేలా పోలీసు శాఖ సిద్ధం కావాలని జగన్ సూచించారు. దిశ పోలీస్ స్టేషన్లు, స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది తక్షణమే స్పందించేలా సన్నద్ధం చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లకు అవసరమైనన్ని పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
దిశ యాప్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం – సుచరిత
మహిళల భద్రత కోసం మరింత పకడ్బందీగా వ్యవహరించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. మహిళల భద్రతపై సీఎం జగన్ అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడారు. దిశ యాప్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ పెట్టాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలోని మహిళలకు ఈ యాప్ పై అవగాహన వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. దీనిలో వలంటీర్లు, మహిళా పోలీసులను వినియోగించుకోవాలని సూచించారు. కాలేజీలు, స్కూళ్లు తెరిచిన తర్వాత విద్యార్థినులకు దిశా యాప్ పై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. పెట్రోలింగ్ వాహనాలను, సీసీ కెమెరాలను అవసరమైన చోట పెంచాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. సీతానగరం ఘటనలో అనుమానితులను గుర్తించామని… త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెడతామని తెలిపారు. నిర్మానుష్యప్రాంతంలో జరగడంతో అనుమానితులను గుర్తించడం కష్టంగా మారింది. అయినా బాధితురాలి సహకారంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు.