kaushik reddy

 

కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా

 

🔹నోటీసులతో తాజా నిర్ణయం
🔹అధికారికంగా 16న గులాబీ పార్టీలోకి.!

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ..కీలకంగా మారిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుండి భర్తరఫ్..అదే విధంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో కౌశిక్ తెర మీదకు వచ్చారు. ఈటల అనేక కుంభకోణాలకు పాల్పడ్డారంటూ మీడియా ముందుకొచ్చారు. ఆ తరువాత ఆయన టీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం సాగింది. కౌశిక్ రెడ్డి ఈ మధ్య కాలంలో ప్రయివేటు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. ఆ ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో..కౌశిక్ రెడ్డి తాను గులాబీ పార్టీలోకి వెళ్లటం లేదని..హుజూరాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్దిగానే పోటీ చేస్తానంటూ చెప్పుకొచ్చారు. ఈ సమయంలో..కౌశిక్ రెడ్డి ఒక కాంగ్రెస్ కార్యకర్తకు ఫోన్ చేసి తనకు టీఆర్ఎస్ టిక్కెట్ ఖరారైందని..తానే అధికార పార్టీ నుంచి హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. యవకుల మద్దతు కూడగట్టాలని…డబ్బుల సంగతి తానే చూసుకుంటానంటూ హామీ ఇచ్చారు. ఈ ఆడియో లీక్ కావటంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీంతో..ఈ మొత్తం వ్యవహారం పైన కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణా సంఘానికి సూచించారు. ఆ వెంటనే కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. గంటలోగా సమాధానం ఇవ్వాలని అందులో సూచించారు. కౌశిక్‌రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ హుజురాబాద్‌లో డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ తీర్మానం చేశారు. ఈ మేరకు హుజురాబాద్ ఇన్‌ఛార్జ్‌ దామోదర రాజనర్సింహకి లేఖ రాశారు.ఇదే సమయంలో తనకు నోటీసులు జారీ కావటంతో కౌశిక్ రెడ్డి తన సన్నిహితులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ కు పంపారు. గతంలో హుజురాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఈటల చేతిలో ఓటమిపాలైన పాడి కౌశిక్‌ రెడ్డిని టీఆర్‌ఎస్‌ ఇప్పడు అభ్యర్దిగా నిలబెడుతుందనే ప్రచారం కొద్ది కాలంగా సాగుతోంది. అయితే, రెడ్డి వర్గానికి ఇవ్వాలా …లేక ఈటల ను ఓడించాలంటే బీసీ వర్గానికి చెందిన వారినే బరిలోకి దింపాలా అనే దాని పైన హుజూరాబాద్ పార్టీ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. దీంతో..కౌశిక్ రెడ్డికి హుజూరాబాద్ నుండి గులాబీ పార్టీ టిక్కెట్ ఖాయమనే ప్రచారం సాగుతున్నా..నియోజకవర్గంలో మారుతున్న సమీకణాలు..బలా బలాలు ఆధారంగా సీఎం కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్ తరువాతనే నిర్నయం తీసుకొనే అవకాశం ఉంది. కానీ, కౌశిక్ రెడ్డి ముందుగానే టీఆర్ఎస్ లో చేరటం ద్వారా తన సీటుకు మరింత మద్దతు పెంచుకోవాలని భావిస్తున్నారని చెబుతున్నారు. దీంతో..ఆయన ఈ నెల 16వ తేదీన గులాబీ కండువా కప్పుకుంటారని సమాచారం. కౌశిక్ రెడ్డి తన భవిష్యత్ అడుగుల గురించి స్పష్టత ఇవ్వాల్సి ఉంది.