కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతూనే ఉంది. నీటి వాటాలపై జగడం కంటిన్యూ అవుతోంది. తెలంగాణ, ఏపీ కేంద్రానికి తమ వాదన వినిపిస్తోంది. తాజాగా కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డుకు లేఖరాసింది. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించాలంటే త్రిసభ్యకమిటీ ఆమోదం ఉండాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. త్రిసభ్య కమిటీ ఆమోదించకుండా పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించేందుకు అనుమతి ఇవ్వకూడదని కృష్ణా బోర్డును కోరింది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతున్నందున 2021-22 ఇయర్ నుంచి రెండు రాష్ట్రాలకు సమానంగా నీటిని పంచాలని కోరింది. కృష్ణా నదికి వరద పోటెత్తిన నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని, ఏపీ జల విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని లేఖలో పేర్కొంది. జల విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ కూడా చేసుకోవాలని.. అబ్జెక్షన్ లేదని తెలిపింది. మరోవైపు కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతోంది. నదిపై ఉన్న ప్రాజెక్టులు నిండు కుండలా కనిపిస్తున్నాయి. వరద అధికంగా ఉండటంతో విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. గతంలో ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు మేరకు కృష్ణా నదిపై ఉన్న తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం నీరు పుష్కలంగా ఉండటంతో విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్ను కోరింది.