కేసీఆర్ మానసిక సమతుల్యత లోపించిందా.?
గుప్పిట్లో వైకుంఠం చూపిస్తున్నారు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిల్లు, బిల్డుప్ ఫుల్లు
తెలంగాణ ప్రజల భవితవ్యాన్ని అంధకారంలోకి నెడుతున్నారు
కేసీఆర్ పాలనపై విజయశాంతి ఫైర్
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు,ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు పట్ల బీజేపీ నేత విజయశాంతి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెట్టారు. కేసీఆర్పై వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ చేష్టలు,సభలు-సమావేశాల్లో ఆయన మాట్లాడే పిచ్చి మాటలు వింటుంటే ఆయన చిప్పు ఖరాబైందని అనుకోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. మానసిక సమతులత్య లోపించడం వల్లే ఆయన ఇలా చేస్తున్నారా.. లేక కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేస్తే మేలని అందరూ అనుకోవాలన్న ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నారో తెలియదంటూ కామెంట్ చేశారు. ‘కేసీఆర్ మానసిక సమతుల్యత లోపించి ఇలా చేస్తున్నారా..? గతంలో కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేద్దామంటే వ్యతిరేకత వచ్చింది కాబట్టి, ఈ రకమైన వింత, విపరీత విన్యాసాలు చేస్తే, ఈ సీఎం గారి కన్నా… మాట్లాడే పద్ధతి, కార్యనిర్వహణ విధంలో కేటీఆర్ గారి తీరు కొంత సెన్సిబుల్గా ఉంటుంది కాబట్టి…కేటీఆర్ గారినే ముఖ్యమంత్రిగా చేస్తే మేలని… అందరూ అనుకోవాలనే ఆలోచనతో కేసీఆర్ గారు ఇవన్నీ చేస్తున్నారో తెలియదు.’ అని విజయశాంతి పేర్కొన్నారు.
‘ఏమీ లేకపోయినా అరచేతిలో స్వర్గం చూపించే ఘనుల్లో టాప్ ర్యాంక్ ఎవరికైనా ఇవ్వాలంటే అందుకు అన్ని అర్హతలూ ఉన్న ఏకైక వ్యక్తి తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమే. ఒక పక్క తెలంగాణ ఖజానా ఖాళీ అయినా… గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయినా… ప్రస్తుతం అమలవుతున్న పథకాలకే న్యాయం చెయ్యలేకపోతున్నా… కొత్త హామీలు, పథకాలతో ప్రజల నోట్లో మన్ను కొడుతూ, అన్ని రోజులూ ఇలాగే ఉంటాయనుకుంటూ ఊహాలోకంలో విహరించడమేగాక, గుప్పిట్లో వైకుంఠాన్ని చూపిస్తున్నారు..’ అని విజయశాంతి విమర్శించారు. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒకసారి గమనిస్తే… ఒకపక్క ఈ ప్రభుత్వ పథకాల కోసం పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగులో ఉన్నాయి. రైతులకు రూ.1లక్షలోపు పంట రుణాల మాఫీకి డబ్బులు లేవు. వివిధ ప్రాజెక్టుల నిర్వాసితులకు సక్రమంగా పరిహారం అందించలేకపోతున్నారు. ప్రతిష్టాత్మకమైన డబుల్ బెడ్రూం పథకం నాసిరకం పనులతో ఒక అడుగు ముందుకు… పదడుగులు వెనక్కి అన్నట్టు సాగుతోంది.’ అని విమర్శించారు.
‘ఆర్టీసీని అధోగతి పాలు చేశారు. మరోపక్క కరోనా లాక్డౌన్ సమయంలో ఉద్యోగుల జీతాలు, పాలనాపరమైన ఖర్చుల కోసం దాదాపుగా ఇప్పటివరకూ రూ.21 వేల కోట్ల మేర అప్పులు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వేల కోట్ల రూపాయల నిధులతో ముడిపడిన దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని సీఎం గారు చెబితే నమ్మాలా? దీనికి తోడు కొత్త రేషన్ కార్డుల జారీ, వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సు పెంపు దిశగా తెలంగాణ సర్కారు ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఆసరా పింఛన్ చెల్లింపులు చెయ్యలేక కిందా మీదా పడుతున్నారు.ఇవిగాక, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఇన్సెంటివ్లు, గొర్రెల పంపిణీ యునిట్ విలువ పెంపు, 8 లక్షలకు పైగా ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగుకు ప్రోత్సాహం, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధుల పెంపు… ఇలా చూసుకుంటూ పోతే పథకాలు, హామీలే తప్ప…వాటికి తగిన నిధుల సమీకరణ… ఆ మేరకు ఆదాయం గానీ, కేటాయింపులు గానీ కానరాని పరిస్థితుల్లో తెలంగాణ ఖజానాను కుంగదీశారు. ధనిక రాష్ట్రమని చెబుతూ అప్పుల పాలు చేసిన ఈ సర్కారు తన తప్పుడు నిర్ణయాలతో తెలంగాణ ప్రజల.భవితవ్యాన్ని అంధకారంలోకి నెడుతోంది.’ అని విజయశాంతి విమర్శించారు.