Jagananna Pachathoranam

 

జగనన్న పచ్చతోరణంకు శ్రీకారం..

 

🔹వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జగన్
🔹అటవీ విస్తీర్ణాన్ని 33 శాతం పెంచే దిశగా ప్రయత్నం
🔹సభలో ప్రతిజ్ఞ చేయించిన సీఎం
🔹స్కూల్ డేస్ గుర్తుకుతెచ్చుకున్న సీఎం

 

గుంటూరు (ప్రశ్న న్యూస్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగిన వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎయిమ్స్‌ ఆవరణలో వేప, రావి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం జగన్… “చెట్ల పెంపకానికి సంబంధించి రెండు, మూడు చిన్న చిన్న విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటే… అవి ఎంత అవసరమో మనకు నిరంతరం తెలుస్తుంది. ఒకటి.. మనం పీల్చే గాలి ఆక్సిజన్‌. ప్రపంచంలో ఏ జీవి అయినా ఆక్సిజన్‌ను పీల్చుకుని కార్బన్ ‌డై ఆక్సైడ్‌ వదిలేస్తుంది. ఒక్క చెట్టు మాత్రమే పగటి పూట కార్భన్‌ డై ఆక్సైడ్‌ తీసుకుని ఆక్సిజన్‌ను వదులుతుంది. అంటే ఒక చెట్టు ఉంటే ప్యూర్‌గా ఉన్న ఆక్సిజన్‌ లెవెల్స్‌ మెరుగ్గా ఉంటాయన్నది ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం. రెండో అంశం.. చెట్లు ఉన్న చోట మాత్రమే మంచి వర్షాలు కూడా కురిసే పరిస్ధితి ఉంటుంది. మనం పదో తరగితి చదువుల్లో, పరీక్షలు రాసేటప్పుడు తెలుసుకున్న విషయాలివి. ఆస్మోసిస్‌ అని, ట్రాన్సిపరేషన్, గటేషన్‌ అని రకరకాలు సిద్ధాంతాలు అన్నీ చదివాం. చెట్లు వలన వర్షం ఎలా ప్రభావితం అవుతుంది, ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు ఎందుకుంటాయి అనే ఈ రెండు విషయాలును జ్ఞాపకం ఉంచుకోవాలి.” అని అన్నారు. రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో ఈరోజు 23 శాతం మాత్రమే ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33 శాతం పెంచే దిశగా అందరం ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. మనందరం కలిసి చెట్లను నాటి, వాటిని సంరక్షించేందుకు అందరం కలిసి ప్రతిజ్ఞ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మనం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడు, ప్రతి అవ్వా, తాత తమ మనసులో ఈ ప్రతిజ్ఞ చేయాలి. చెట్లకు తోడుగా అందరం కలిసికట్టుగా ఉండి అడుగులు వేస్తే..మన రాష్ట్రంలో చెట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది జరగాలని కోరుకుంటున్నాన అని జగన్ అన్నారు.

“ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి, ప్రకృతిలోని సమతుల్య స్ధితి అవసరాన్ని గుర్తిస్తూ… ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని, నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా, వాడవాడా, ఇంటా బయటా, అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్‌ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నాను. మనసా, వాచా, కర్మణా అందరం దీనికి కట్టుబడి ఉండి ఈ చెట్లకు మానవజాతి తోడుగా ఉండాలని కోరుకుంటూ, మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను” అని జగన్‌ తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.