జగనన్న విద్యాకానుక
విద్యావిధానంలో సమూల మార్పులు..
నాడు-నేడు, విద్యాకానుకకు అంతా సిద్ధం..
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన ఏపీ
అమరావతి (ప్రశ్న న్యూస్) ఆంధ్రప్రదేశ్ లోని విద్యావిధానంలో సమూల మార్పులకు నాంది పలికినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాకుండా.. ఇంగ్లీష్ మీడియం, కార్పొరేట్ తరహా క్లాసు రూములతో విద్యార్ధులకు మెరుగైన విద్య అందిస్తున్నట్లు తెలిపింది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో రూ.731.30 కోట్ల ఖర్చుతో జగనన్న విద్యాకానుక రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 16న ఉదయం 11 గం.లకు తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో స్వయంగా పాల్గొని ప్రారంభించనున్నారు. విద్యారంగంపై ఇప్పటి వరకు రూ.29,114.37 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం వెల్లడించింది. విద్యాసంవత్సరం విద్యార్థులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో “జగనన్న విద్యాకానుక” పథకం ప్రవేశపెట్టి రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 42,34,322 మంది విద్యార్థులకు వారి విద్యాభ్యాసానికి అవసరమైన ఏడు రకాల వస్తువులను కిట్ల రూపంలో అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను గణనీయంగా పెంచడంతో పాటు, మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే మొదటి విడతగా రూ.648.10 కోట్ల ఖర్చుతో స్కూల్ కిట్లు పంపిణీ చేయగా, రూ.731.30 కోట్ల ఖర్చుతో రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
విద్యాకానుక కిట్ ద్వారా ప్రతి విద్యార్థికి ఉచితంగా అందించే బై లింగువల్ పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్ లు, వర్క్ బుక్ లు, కుట్టుకూలితో సహా మూడు జతల యూనిఫాం క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీలు అందిస్తున్నారు. సీబీఎస్ఈ సిలబస్ తో ప్రాథమిక స్థాయి నుండే ఆంగ్లంలో విద్యాబోధన, ‘జగనన్న విద్యాకానుక’ ద్వారా కిట్ల పంపిణీ కారణంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు బాగా పెరిగాయి. కొన్ని స్కూళ్లలో 100 శాతానికి పైగా కూడా ఎన్ రోల్ మెంట్ పెరిగిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కేవలం 37 లక్షలుగా ఉంటే, ప్రస్తుతం వారి సంఖ్య గణనీయంగా పెరిగి 43 లక్షలకు చేరింది.జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాల ద్వారా ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేయడమే గాక విద్యార్థుల కోరిక మేరకు నగదు లేదా ల్యాప్ టాప్ అందిస్తోంది ప్రభుత్వం. అదేవిధంగా జగనన్న గోరుముద్ద ద్వారా రోజూ మెనూ మార్చి రుచికరమైన, నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ‘మనబడి-నాడు నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయుకు ఫర్నీచర్, రక్షిత త్రాగునీరు, పెయింటింగ్, ఆకర్షణీయంగా కనిపించే ప్రహారీ గోడ, పాఠశాలకు అవసరమైన మరమ్మతులు, రంగు రంగుల బెంచీలు, విశాలమైన ఆట స్థలం, నిరంతర నీటి వసతితో కూడిన మంచి బాత్ రూమ్ లు, గ్రీన్ చాక్ బోర్డు, ప్రతి గదికి ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, వంటగది, ఆంగ్లంలో నైపుణ్యాలు పెంపొందేందుకు ఇంగ్లీష్ ల్యాబ్ లు వంటి మౌలిక వసతుల కల్పనతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారాయి.
రాష్ట్రంలో 34 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు అభివృద్ధి చేసి ఏ సిలబస్ తీసుకున్నా కూడా ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో పాఠ్యపుస్తకాలు అందించిన మొట్టమొదటి ప్రభుత్వం ఏపీనే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి తరగతికి తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్ గా తీసుకురావడమే గాక సీబీఎస్ఈతో అనుసంధానం చేసినట్లు వివరించింది. మరోవైపు నూతన విద్యావిధానంలో స్కూళ్లను 6 రకాలుగా వర్గీకరించి.. ఏ స్కూల్ మూసివేయ కూడదు.. ఏ ఒక్క టీచర్ను తీసేయడకూడదని నిర్ణయించిన ప్రభుత్వం ప్రతి సబ్జెక్ట్ కు ఒక టీచర్, ప్రతి తరగతికి ఒక గది ఉండేలా చర్యలు తీసుకుంటోంది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 4,878 అదనపు తరగతి గదులు మంజూరు చేస్తూ ఇటీవలే మంత్రిమండలి కూడా తీర్మానం చేసింది. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మనబడి నాడు-నేడు కింద విద్యారంగంపై ఇప్పటి వరకు రూ.29,114.37 కోట్ల ఖర్చు చేయడమే కాకుండా వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా అప్ గ్రేడ్ కాబోతున్న అంగన్ వాడీలలో ఆటపాటలతో విద్యాబోధన ద్వారా పిల్లల శారీరక, మానసిక వికాసానికి గట్టి పునాదులు వేయడమే గాకుండా పిల్లలు, గర్భిణీలు, బాలింతల పోషకాహారం కోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా మరో రూ.1800 కోట్లు అదనంగా ఖర్చు చేస్తోంది ప్రభుత్వం.