జూన్ 15 నుంచి ‘రైతుబంధు’
🔹25 లోపు అందరి ఖాతాల్లోకి..
🔹సమీక్షలో సీఎం కేసీఆర్ ప్రకటన
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణలో ఆరునూరైనా, వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింప చేసి, స్థిరీకరించాలన్న తమ ధ్యేయం నెరవేరిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయతో పాటు, సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి, కోటి ఎకరాల మాగాణాగా తెలంగాణను తీర్చిదిద్దడంలో విజయం సాధించామని, వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని గుణాత్మకంగా మార్చామని పేర్కొన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, కాళేశ్వరం లాంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పట్టుపట్టి పూర్తి చేశామని అన్నారు. వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు.జూన్ 15 నుంచి 25 వ తేదీ లోపల రైతు బంధు పంటసాయం కింద ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలని సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. గత యాసంగిలో అవలంబించిన విధానాన్నే ఇప్పుడు కూడా అవలంబిస్తూ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సూచించారు. ఇప్పటిదాకా ఇచ్చిన కేటగిరీల వారిగానే రైతు బంధు సాయాన్ని ఖాతాలో వేయాలన్నారు. కాగా జూన్ 10 వ తేదీని కటాఫ్ డేట్గా పెట్టుకోని, ఆ తేదీ వరకూ పార్ట్ బీ నుంచి పార్ట్ ఏలోకి చేరిన భూములకు రైతు బంధు వర్తింప జేయాలని సీఎం ఆదేశించారు. వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. కల్తీ విత్తనాల మీద ఉక్కుపాదం మోపాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాల వ్యాప్తంగా కల్తీ విత్తన తయారీదారుల మీద దాడులు జరపాలని, కల్తీ విత్తనదారులను వలవేసి పట్టుకోవాలని, ఎంత వారినైనా ఉపేక్షించ వద్దని ఆదేశించారు. వారిపై పీడీ యాక్టు మోపి, అరెస్ట్ చేయాలని సూచించారు. చిత్తశుద్ధితో పనిచేసి కల్తీ విత్తన విక్రయ ముఠాలను పట్టుకున్న పోలీసు అధికారులకు ప్రమోషన్లు, రాయితీలు, సేవా పతకం కూడా అందజేయాలని అధికారులను కోరారు. ఈ మేరకు తక్షణమే పోలీసులను రంగంలోకి దింపాలని కేసీఆర్ ఆదేశించారు.