jagan

 

పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే: సీఎం జగన్‌

 

🔹ఉన్నత చదువులతోనే పేదరిక నిర్మూలన…
🔹తల్లిదండ్రులు అప్పులు పాలు కాకూడదనే…
🔹నూరు శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌

 

అమరావతి (ప్రశ్న న్యూస్) ఈ ఏడాదికి గాను జగనన్న విద్యా దీవెన రెండో విడత సొమ్మును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్లను విడుదల చేశారు. నిరుపేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో, బకాయిలు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారు. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే ఆ పిల్లల తల్లులకే చెల్లించి, వారే కాలేజీలకు ఫీజులు కట్టేలా చేసి పేదల ఇంట విద్యా జ్యోతులు వెలిగిస్తున్నారు. విద్యా దీవెన రెండో విడత సొమ్ము విడుదల కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే.. ప్రతి అడుగులోను విద్యార్థుల భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నాం. ప్రతీ ఒక్కరూ బాగా చదువుకోవాలనేది నా తాపత్రాయం. ఇందులో భాగంగానే జగనన్న విద్యా దీవెన అనే మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తల్లిదండ్రులకు భారం లేకుండా విద్యాదీవెన అమలు చేస్తున్నాం. దేవుడి ఆశీస్సులతోనే ఇదంతా చేయగల్గుతున్నాం. ప్రతి పేద విద్యార్థికి చదువు అందుబాటులోకి రావాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యం. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల భవిష్యత్తు కోసం 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాం’’ అన్నారు.

సీఎం జగన్ మాట్లాడుతు, మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నారు. దేవుడి దయతో అక్షరాలా 10.97లక్షల పైచిలుకు పిల్లలకు దాదాపు రూ.694 కోట్లు నేరుగా 9,88,437 మంది తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రతిచెల్లెమ్మ, ప్రతి తమ్ముడు బాగా చదవాలని, వాళ్లకు మన తరఫు నుంచి ఇవ్వదగ్గ ఆస్తి ఏదైనా ఉందంటే అంది చదువే అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. మనసా, వాచా, కర్మేణా సంపూర్ణఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయాలన్న తపన, తాపత్రయం ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. దేవుడి దయ వలన ఈ కార్యక్రమం ఇవాళ చేయగలుగుతున్నాం. కొన్ని కొన్ని విషయాలను మనం పరిగణలోకి తీసుకొంటే ఇంకా మనం చాలా వెనకబాటులో ఉన్నాం. రాష్ట్రంలో చదువురాని వారు 2011 లెక్కలప్రకారం 33శాతం మంది ఉన్నారు. దేశంలో సగటు చూస్తే వీరు 27శాతం మంది ఉన్నారు. దేశం కన్నా రాష్ట్రం ఇంకా తక్కువ స్ధానంలో ఉంది.  18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలు ఇంటర్‌ పూర్తైన తర్వాత ఎంతమంది కాలేజీలకు వెళ్తున్నారని చూస్తే.. ఆశ్చర్యకరమైన నంబర్లు కనిపిస్తున్నాయి. మనం బ్రిక్స్‌దేశాలతో పోల్చిచూసుకుంటాం. ఇవన్నీ ఒకేరకమైన ఎకానమీ ఉన్న దేశాలు. బ్రిక్స్‌ అంటే బ్రెజిల్, రష్యా, చైనా, సౌతాఫ్రికా, ఇండియా దేశాలతో సరిపోల్చి చూస్తాం. ఈ వయస్సు పిల్లలు ఎంత మంది ఇంటర్‌ తర్వాత కాలేజీలకు పోతున్నారో చూస్తే.. బ్రెజిల్‌లో దాదాపు 51.8 శాతం, రష్యాలో 83.4 శాతం, చైనాలో 54.7 శాతం పిల్లలు చేరుతున్నారు. మన దేశంలో కేవలం 27శాతం మాత్రమే కాలేజీలకు వెళ్తున్నారు. దాదాపు 73శాతం మంది పిల్లలకు ఇంటర్మీడియట్‌ అయిన తర్వాత కాలేజీల్లో చేరడంలేదు. పిల్లలు పై చదువులు చదవకపోతే, పై స్ధాయి ఉద్యోగాలు సాధించలేకపోతే పేదరికాన్ని ఎప్పుడూ తీసేయలేం.

పెద్ద చదువులు పిల్లలకు అందుబాటులోకి రావాలి. ఆ చదువులు కోసం తల్లిదండ్రులు అప్పులు పాలు కాకుండా, అవి పిల్లలకు అందుబాటులోకి వచ్చినప్పుడే వారి తలరాతలు మారుతాయి. అప్పుడే మంచి ఉద్యోగాలు వస్తాయి, పెద్ద జీతాలు వచ్చే అవకాశాలుంటాయి, వారి జీవితాలు మారుతాయి. ఈ పరిస్థితుల్లో మార్పులు తీసుకురావడానికి… అధికారంలోకి వచ్చిన వెంటనే నాన్నగారు ఫీజు రియింబర్స్‌మెంట్‌ విషయంలో ఒక అడుగు ముందుకేస్తే.. జగన్‌ అనే నేను నాలుగు అడుగులు ముందుకు వేశాను. ఆ దిశగా అడుగులు వేస్తూ ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలలో ప్రతి పేదవాడికి, ఓసీల్లో ఉన్న పేద పిల్లలకు పూర్తిగా ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాం. వారి తల్లితండ్రులు అప్పులు పాలయ్యే పరిస్థితిని మారుస్తున్నాం అంతేకాక హాస్టల్‌ ఖర్చుల కోసం సంవత్సరానికి రూ.20వేలు ఇస్తున్నాం. వసతి ఖర్చులకోసం తల్లిదండ్రులు అప్పులు పాలు కాకూడదని కూడా మేం ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. వసతి దీవెన కింద ఈ డబ్బు ఇస్తున్నాం. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఫీజు రియింబర్స్‌మెంట్, వసతి దీవెన కోసం ఇంతగా ఖర్చు చేస్తున్నాం.

ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్,మెడిసిన్‌ చదువుతున్న పిల్లలకు పూర్తిగా నూరుశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో రెండో సంవత్సరం కూడా అడుగులు బాగా ముందుకు వేయగలిగాం. దేశంలో ఎక్కడా లేని విధంగా బకాయిలు లేకుండా, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రతి త్రైమాసికానికి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నాం. వారు కాలేజీలకు వెళ్లి డబ్బులు కట్టే పరిస్థితి ఉంది. దీనివల్ల దాదాపు 10.97 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుంది. అందులో భాగంగా ఈయేడాది రెండో విడత కింద రూ.694 కోట్లు విడుదల చేసామన్నారు.