అన్నీ భవిష్యత్తులోనే చేస్తారా.? ఇప్పుడేం చేయరా.?
ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
🔹కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ
🔹కరోనాపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక
🔹నివేదిక సమర్పించిన జీహెచ్ఎంసీ, డీజీపీ, డీహెచ్
🔹కొన్ని ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదన్న న్యాయస్థానం
🔹ఆదేశాల అమలుపై అసహనం
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తమ ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించడంపై తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్) హైకోర్టుకు మంగళవారం నివేదిక సమర్పించింది.ఈ నేపథ్యంలో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఇచ్చిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సల ధరలు ఒకే విధంగా ఉండాలన్న ఆదేశాలు అమలు చేశారా? ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సల గరిష్ట ధరలను సవరిస్తూ తాజా జీవో ఇచ్చారా? కరోనాపై సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదు? కొత్త ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు ఇంకెప్పుడు అందుబాటులోకి వస్తాయి? అని హైకోర్టు సర్కారును నిలదీసింది. నివేదికలో మూడో దశ సన్నద్ధతపై వివరాలు సమగ్రంగా లేవని, మరికొన్ని ఆదేశాలు అమలు చేశారో లేదో నివేదికలో వివరించలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో ఒకే జిల్లాలో 8వేల మంది చిన్నారులు కరోనాబారిన పడ్డారని గుర్తు చేసిన హైకోర్టు.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించింది.
అన్నీ భవిష్యత్లోనే చేస్తారా? ఇప్పుడేమీ చేయడం లేదా? అంటూ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. బంగారం తాకట్టు పెట్టి ఆస్పత్రులకు ఫీజులు చెల్లిస్తున్నారని పేర్కొంది. ఆస్పత్రుల లైసెన్సులు రద్దు చేశారు కానీ.. వారి నుంచి కరోనా రోగులకు డబ్బులు తిరిగి ఇప్పించారా? అని ప్రశ్నించింది. బుధవారం నాటి విచారణకు హెల్త్ సెక్రటరీ, డీజీపీ సహా సంబంధిత అధికారులు హాజరుకావాలని ఆదేశించింది.డీహెచ్ ఖమ్మం వెళ్లినందుకు విచారణకు హాజరుకాలేదని ప్రభుత్వం తరపున అడ్వోకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ న్యాయస్థానానికి తెలిపారు. హైకోర్టు ప్రశ్నలకు వివరాలు అడిగి తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని కోరారు. కేటాయించిన బ్లాక్ ఫంగస్ ఔషధాలు ఎందుకు సరఫరా చేయలేదో తెలపాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. అనంతరం కరోనా పరిస్థితులపై విచారణను బుధవారంకు వాయిదా వేసింది.
ఇక, థర్డ్ వేవ్కు ప్రభుత్వం ఎలా సన్నద్ధం అవుతోంది? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు.. దీనిపై వివరాలు లేవా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ దశగా మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి? అని ప్రశ్నించింది.. నిలోఫర్లో 200 పడకలు ఏర్పాటు చేస్తే సరిపోతుందా? అని ప్రశ్నించింది.. అసలు, కోవిడ్ థర్డ్ వేవ్ కట్టడికి ఎలా సన్నద్ధం అవుతున్నారని నిలదీసింది.. మే 17న విచారణలో చాలా ప్రశ్నలు లేవనెత్తింది హైకోర్టు.. వాటిపై సమాధానాలు ఇవ్వాలని కోరింది. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స రేట్లను నిర్ణయిస్తూ కొత్త జీవో విడుదల చేయాలని కోరింది.. కానీ, జీవో విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. తాము ఇచ్చిన చాలా ఆదేశాలు పాటించలేదు.. కరోనాపై సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించింది.