బండి సీజ్ చేసే అధికారం పోలీసులకి లేదు, అదంతా అబద్ధం..
క్లారిటీ ఇచ్చిన పోలీసులు
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) పెండింగ్ చలాన్లు ఉన్నా.. వాహనాన్ని సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పిందని సంబరపడిన వాహనదారులకు సైబరాబాద్ పోలీసులు ఊహించని షాకిచ్చారు. ట్రాఫిక్ పోలీసులకు వాహనాలను సీజ్ చేసే అధికారం లేదని వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవాలని కొట్టిపారేశారు. గౌరవనీయ కోర్టు అలాంటి తీర్పు చెప్పలేదని.. ఉద్దేశపూర్వకంగానే ఫేక్ న్యూస్ని ప్రచారం చేస్తున్నారని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు పబ్లిక్ నోటీస్ విడుదల చేశారు. ఇటీవల రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు ఒక్క చలానా పెండింగ్ ఉందని ఓ న్యాయవాది బైక్ని సీజ్ చేయడంతో ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం చలాన్లు పెండింగ్ ఉన్నాయని వాహనాన్ని సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులు తీర్పు చెప్పినట్లు ప్రచారం జరిగింది. అన్ని మీడియా సంస్థల్లోనూ ప్రముఖంగా కథనాలు వచ్చాయి. అయితే అవేవీ నిజం కాదని చెబుతున్నారు సైబరాబాద్ పోలీసులు.
రిట్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆ నెల 11న పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చిందని పోలీసులు తెలిపారు. అలాగే వాహనం రిలీజ్ చేయించుకునేందుకు పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించిందని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పిటిషనర్ రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించారని తెలిపారు. సెంట్రల్ మోటార్ వెహికల్స్ యాక్ట్ 1989 ప్రకారం సంబంధిత జరిమానా సొమ్మును చెల్లించడంతో చట్టప్రకారం వాహనాన్ని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. పిటిషనర్ ఈ నిజాలన్నింటినీ దాచి ఉద్దేశపూర్వకంగా హైకోర్టు ఉత్తర్వులను తప్పుగా ప్రచారం చేస్తూ వాహనదారులను గందరగోళానికి గురిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. చలాన్ వేసిన తర్వాత 90 రోజుల్లో చెల్లించకపోతే వాహన యజమానికి సమాచారం అందించి బండి సీజ్ చేసే అధికారం ఉందని.. 167 సీఎంఆర్వీ యాక్ట్ 1987 ప్రకారం అదే చెబుతోందని పోలీసులు స్పష్టం చేశారు. అసత్య కథనాలకు కారణమైన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలియజేశారు.