prashanth kishor

 

రాహుల్ గాంధీతో ప్రశాంత్ కిశోర్ భేటీ

 

🔹ఆసక్తికర పరిణామం..
🔹అసలేం జరుగుతోంది ?

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) ఎన్నికల వ్యూహకర్తగా పలు రాజకీయ పార్టీలకు తిరుగులేని విజయాలను తెచ్చిపెట్టిన ప్రశాంత్ కిశోర్.. బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయం తరువాత ఈ రకమైన కార్యకలాపాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే కొద్దిరోజులుగా ఆయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రశాంత్ కిశోర్ వ్యూహరచన చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఇందుకు శరద్ పవార్‌ నాయకత్వం వహించేలా పీకే ప్లాన్ చేస్తున్నారనే చర్చ కూడా సాగింది.అలాంటి ప్రశాంత్ కిశోర్ ఉన్నట్టుండి నేడు కాంగ్రెస్ ముఖ్యనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. వీరితో పీకే ఏం చర్చించారనే విషయం తెలియకపోయినప్పటికీ.. ఆయన మూడో కూటమిలో కాంగ్రెస్‌ చేరేలా వారిని ఒప్పించడానికి చర్చలు జరపారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ప్రశాంత్ కిశోర్, రాహుల్ గాంధీ చర్చల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.

వచ్చే ఏడాది జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఎలాగైనా గెలవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. మరోవైపు యూపీ ఎన్నికల్లో తమ ప్రభావం చూపించాలని కాంగ్రెస్ భావిస్తున్న తరుణంలో అక్కడి రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పీకే సమావేశమయ్యారు. దీంతో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటేందుకు ప్రశాంత్ కిశోర్ ఆ పార్టీకి సలహాలు ఇస్తున్నారా ? అనే చర్చ కూడా సాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పీకే ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించే విషయంలో కీలక భూమిక పోషించారు. అయితే గతంలో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పీకే పాచికలు పారలేదు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో పీకే సమావేశం మూడో ఫ్రంట్ కోసం జరిగిందా లేక యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం జరిగిందా ? అన్నది చూడాలి.