వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీలో కీలక మార్పులు.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం…
ఏపీ డిజిటల్ హెల్త్పై సమీక్ష
పిల్లల వ్యాక్సిన్లుపైనా ప్రత్యేక దృష్టి
జిల్లా యూనిట్గా నియామకాలు
గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం
కోవిడ్– వ్యాక్సినేషన్–శాస్త్రీయ విశ్లేషణ
అమరావతి (ప్రశ్న న్యూస్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకంలో కీలక మార్పులు జరగనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. బుధవారం కోవిడ్ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ను మరింత వేవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని వ్యాక్సిన్ వేయాలన్నారు. ఉపాధ్యాయులు సహా, స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దీనివల్ల క్రమబద్ధంగా, ప్రాధాన్యత పరంగా వ్యాక్సినేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు. 18–44 ఏళ్ల మధ్యనున్న వారికి కూడా వ్యాక్సిన్లు ఇవ్వాలి కాబట్టి దీనిపై కార్యాచరణ రూపొందించాలన్న ఆదేశించారు. ఎక్కువ ప్రజా బాహుళ్యంతో సంబంధాలు ఉన్నవారు, ఉద్యోగులు, సిబ్బందికి వ్యాక్సినేషన్లో అధిక ప్రాధాన్యత ఇచ్చేదిశగా ఆలోచనలు చేయాలన్నారు. ఆరోగ్య శ్రీ కార్డులో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాల డేటాను నిక్షిప్తం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. క్యూఆర్కోడ్ రూపంలో ఈ వివరాలు తెలుసుకునేలా ఉండాలన్నారు. విలేజ్క్లినిక్స్లో కూడా డేటా నమోదు ఉండాలని.., ప్రతి విలేజ్, వార్డు క్లినిక్స్లో కంప్యూటర్ ఉండాలన్నారు. ఆరోగ్య వివరాలను నమోదు చేస్తున్న తేదీ, సమయం కూడా క్యూఆర్కోడ్ ద్వారా నిక్షిప్తం కావాలని ఆదేశించారు. అందులో బ్లడ్ గ్రూప్ల వివరాలు కూడా ఉండాలన్నారు. 104 గ్రామాలకు వెళ్లేసరికి, ఒక వ్యక్తి ఆరోగ్య వివరాలు డాక్టర్కు సులభంగా తెలిసేలా ఈ విధానం ఉండాలని.. దీనివల్ల చికిత్స చాలా సులభతరమవుతుందని, వైద్యం త్వరగా అందుతుందని సీఎం అన్నారు. అలాగే షుగర్, బీపీ, బ్లడ్గ్రూపు సహా ఇతర వివరాలను కార్డులో నిక్షిప్తం చేయాలని.., టెస్టులు చేసిన తేదీ, వివరాలు నమోదు సమయం తదితర వివరాలన్నీకూడా ఇందులో పొందుపర్చాలన్నారు.
విలేజ్ క్లినిక్స్లో పనిచేస్తున్న సిబ్బందికి… ఆరోగ్యశ్రీ కింద ఎంపానెల్ అయిన ఆస్పత్రుల వివరాలు అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ ఆదేశించారు. చికిత్స కోసం రోగులను నేరుగా సంబంధిత ఆస్పత్రిలో జాయిన్చేయడం, వారితో సమన్వయం చేసుకోవడం లాంటి బాధ్యతలను సిబ్బంది నెరవేర్చేలా విధానాన్ని అప్ డేట్ చేయాలని సూచించారు. భవిష్యత్తులో కుటుంబానికి కాకుండా విడివిడిగా వ్యక్తుల పేరుమీద ఆరోగ్య శ్రీ కార్డులు ఇచ్చే ఆలోచన చేయాలని.., కుటుంబ సభ్యుడి కార్డు క్యూఆర్ కోడ్తో లాగిన్ కాగానే ఆ వ్యక్తితోపాటు, కుటుంబ సభ్యుల ఆరోగ్యవివరాలు వెంటనే లభ్యమయ్యేలా చూడాలన్నారు. అలాగే వీటిని ఆధార్కార్డు నంబర్తో లింక్చేసేలా చూడాలని.., ఆరోగ్యశ్రీ కార్డు నంబర్చెప్పినా, లేదా ఆధార్ కార్డు నంబర్ చెప్పిన వెంటనే సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలు లభ్యమయ్యే విధానాన్ని తీసుకురావాలని ఆదేశించారు. పిల్లలు అన్నిరకాల వ్యాక్సిన్లు తీసుకుంటున్నారా? లేదా?అన్న వివరాలు కూడా ఆరోగ్యశ్రీ కార్డుల్లో నమోదు చేయాలని సీఎం జగన్ అన్నారు. దీనివల్ల వ్యాక్సిన్లపై ఫాలో అప్ చేయడానికి అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. తల్లులు, పిల్లల ఆరోగ్యంపై విలేజ్క్లినిక్స్ అత్యంత దృష్టిపెడతాయన్నారు. గ్రామాల్లోని నీరు, గాలి, మట్టి నమూనాలను పరిశీలించి కాలుష్య స్థాయిలపై తగిన వివరాలు తీసుకోవాలన్నారు. శానిటేషన్ పరిస్థితులపైకూడా వివరాలు నమోదుకావాలని.., దీనివల్ల వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని జగన్ అన్నారు.
విలేజ్ క్లినిక్స్ నుంచి టీచింగ్ ఆస్పత్రులు వరకూ ఉండాల్సిన సిబ్బంది ఎంత మంది ఉన్నారు, ఎంతమంది కావాలి అన్నదానిపై డేటాను తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశాలిచ్చారు. అవసరమైన సంఖ్యలో వైద్యులను నియమించాలని., జిల్లాను యూనిట్గా తీసుకుని రిక్రూట్మెంట్ చేయాలన్నారు. మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తికావాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు ఎలా అందుతున్నాయన్న దానిపై పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇలాంటి చోట్ల సేవలు అందించే వైద్యులు, సిబ్బందికి ప్రోత్సాహకాలపై ఆలోచన చేయాలన్నారు. వ్యాక్సిన్లు, అనంతర పరిస్థితులపై శాస్త్రీయంగా విశ్లేషణ చేయాలని.., వ్యాక్సిన్లు వేసుకున్నవారిపై వైరస్ ప్రభావం, వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత కూడా వైరస్ సోకిన తీరు తదితర అంశాలపై శాస్త్రీయ విశ్లేషణ చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. ఇతర రాష్ట్రాల్లోకూడా పరిస్థితులను అధ్యయనం చేయాలని అన్నారు. దీనివల్ల రాష్ట్రంలో కోవిడ్ నివారణకు మరింత పటిష్టమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. కోవిడ్ నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్ సన్నద్ధతపై సీఎంకు అధికారులు వివరణ ఇచ్చారు. థర్డ్ వేవ్ వస్తుందన్న సమాచారం నేపధ్యంలో అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. సరిపడా మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.