Chandrababu

 

అమరావతిలో చంద్రబాబు సాధన దీక్ష

 

🔹రాష్ట్రంలోని 175 నియోజక వర్గ కేంద్రాల్లో దీక్ష
🔹కరోనా బాధితులను ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్
🔹కరోనా తో మరణించిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
🔹జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి
🔹ప్రజలకు జరిగిన నష్టం పూడ్చలేనిది .. ఇప్పటికైనా ప్రభుత్వం వారిని ఆదుకోవాలి

 

అమరావతి (ప్రశ్న న్యూస్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సాధన దీక్ష పేరుతో నిరసన దీక్షలను నిర్వహిస్తోంది. కరోనా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్ తో ఈరోజు చంద్రబాబు నాయుడు సాధన దీక్షలో కూర్చున్నారు. అమరావతి టిడిపి పార్టీ కార్యాలయంలో సాధన దీక్షను చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ముందు ప్రధాన డిమాండ్లను ఉంచారు. రాష్ట్రంలోని 175 నియోజక వర్గ కేంద్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ లు దీక్షలను ప్రారంభించారు. అమరావతి లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సాధన దీక్షను ప్రారంభించడానికి ముందు చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు చంద్రబాబు నిరసన దీక్షతో పాటుగా, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకుల నిరసన దీక్షలు కొనసాగాయి. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన 15 మంది నాయకులు పార్టీ ప్రధాన కార్యాలయంలో దీక్షలో పాల్గొన్నారు.

ఇక తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వానికి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న అంశాలను చూస్తే కరోనా పరిస్థితుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి మంది ఉపాధిని కోల్పోయారు అని పేర్కొన్న టిడిపి , తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి, ఆదాయపు పన్ను పరిధిలోకి రాని వారి కుటుంబాలకు పదివేల రూపాయల తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేస్తుంది. కరోనా తీవ్రత కొనసాగినంత కాలం ఈ కుటుంబాలకు ప్రతి నెల 7500 రూపాయలు ఇవ్వాలని టిడిపి డిమాండ్ చేసింది.ఇదే సమయంలో కోవిడ్ తో మరణించిన ప్రతి కుటుంబానికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని, ఆక్సిజన్ మరణాలలన్నింటికీ ప్రభుత్వానిదే బాధ్యత కాబట్టి అలా మృతిచెందిన వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం చెల్లించాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.ఇదే సమయంలో అకాల వర్షాలతో కుదేలైన వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని, కరోనా కారణంగా మరింత దెబ్బతిన్న రైతన్నలను ఆదుకోవడం కోసం వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని టిడిపి డిమాండ్ చేస్తుంది.

విధి నిర్వహణలో చనిపోయిన వైద్య, పారిశుద్ధ్య ,పోలీసు, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకు ఆలస్యం చేయకుండా 50 లక్షల రూపాయలను అందించాలని టిడిపి డిమాండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్ కు 50 లక్షల రూపాయల భీమా సౌకర్యం కల్పించిందని, అదేవిధంగా ఏపీలోని ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా గుర్తించి వారికి సైతం భీమా కల్పించాలని డిమాండ్ చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేసి ప్రజలందరికీ వ్యాక్సిన్లను ఉచితంగా అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది టిడిపి. కరోనా విపత్తును తేలిగ్గా తీసుకోవడమే కాకుండా కరోనా విధ్వంస కాలంలో చేతులెత్తేసిన సర్కార్ జగన్ హయాంలోని వైసిపి ప్రభుత్వమని, దీనివల్ల ఏపీ ప్రజలకు జరిగిన ఆర్థిక, ప్రాణ నష్టాలు పూడ్చలేనివని , ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత తీసుకొని బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టిడిపి సాధన దీక్ష నిర్వహించింది. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు సాధన దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు కార్యకర్తలు, ప్రజలు సాధన దీక్షలో పాల్గొన్నారు . జగన్ సర్కార్ వైఫల్యాలపై టీడీపీ నాయకులు విరుచుకుపడుతున్నారు.