supreme court

 

ఏడేళ్ల కిందట రద్దయిన చట్టం కింద కేసులా – సుప్రీంకోర్టు విస్మయం!

 

🔹ఐటీ చట్టంలోని సెక్షన్-66ఏపై వివాదం.
🔹ఏడేళ్ల కిందట రద్దయిన వివాదాస్పద చట్టం.
🔹1,000పైగా కేసుల నమోదుతో సుప్రీం షాక్.

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) ఐటి చట్టంలోని సెక్షన్ 66-ఏ అమలు చేస్తూ 1,000 కి పైగా కేసులను నమోదుచేయడంపై సుప్రీంకోర్టు సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఆన్‌లైన్‌లో వివాదాస్పద కంటెంట్ పోస్ట్ చేసే వ్యక్తులను అరెస్టు చేయడానికి ఈ చట్టం అధికారులకు అనుమతిస్తోంది. ఏడేళ్ల కిందటే దీనిని నిషేధించినా ప్రస్తుతం 1,000కిపై కేసులను ఈ చట్టం కింద నమోదుచేయడం సర్వోన్నత న్యాయస్థానం విస్తుపోయింది. ఇది చాలా విస్మయానికి గురిచేసే అంశం, దీనిపై నోటీసులు జారీచేస్తామని పేర్కొంది. ‘ఏం జరుగుతుంది.. ఇది చాలా భయంకరమైంది’అని జస్టిస్ ఆర్ నారిమన్, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన తిసభ్య ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఐటీ చట్టం సెక్షన్ 66- ఏ కింద కేసుల నమోదు విషయంలో అన్ని పోలీస్ స్టేషన్లకు కేంద్రం సూచనలు ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ పీపుల్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వాజ్యంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పై విధంగా స్పందించింది. వాస్తవానికి ఐటీ చట్టంలోని సెక్షన్ 66-Aను 2014 మార్చి 24నే సుప్రీంకోర్టు రద్దుచేసింది. ఈ సెక్షన్ కింద కేసు నమోదుచేయడాన్ని శ్రేయ శింఘాల్ అనే న్యాయ విద్యార్ధి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే మృతిచెందిన తర్వాత ముంబయి నగరంలో కర్ఫ్యూ విధించడంతో దీనిపై ఇద్దరు యువతులు ఆన్‌లైన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఐటీ చట్టంలోని సెక్షన్-66 ఏ కింద ఆ ఇద్దరు యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌ను నిరసిస్తూ శ్రేయ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆమె వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. వివాదాస్పద సెక్షన్‌ను కొట్టివేసింది. ఏడేళ్ల కిందట ఈ చట్టం రద్దయితే.. సెక్షన్ 66ఏ కింద కేసులు ఎలా నమోదుచేస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం.. కేంద్రానికి నోటీసులు జారీచేస్తామని స్పష్టం చేసింది.