38 Mandhi Gulabi Nethalapai Kesulu
38 మంది గులాబీ నేతలపై కేసులు
-కేసీఆర్ అన్న కొడుకుపై పోలీస్ కేసు..
-కోట్లు కురిపించే భూమి కబ్జా..
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ధరణీ పోర్టల్ను అడ్డం పెట్టుకుని గులాబీ నేతలు పెద్ద ఎత్తున భూములను తమ పేరుపై రాపించుకున్నారని ధరణి కమిటీ వెల్లడించిన నేపథ్యంలో భూకబ్జాలకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపేందుకు సర్కార్ సిద్ధమైంది. అయితే ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై పోలీసు కేసు నమోదైంది. కోట్లు కురిపించే భూమిని కబ్జా చేసినందుకు గానూ పోలీసులు కన్నారావుతో పాటు 38 మంది బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేశారు.
దీంతో ఈ భూకబ్జా విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లా అధిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రెండు ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు.. అతని అనుయాయులు ప్రయత్నించినట్టు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై ఓఎస్ఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : Mission Divyastra was a success
ఇదే సమయంలో కన్నారావుతో పాటు భూకబ్జాలకు పాల్పడిన మరో 38 మంది బీఆర్ఎస్ నేతలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. భూ యాజమానులు తమ స్థలానికి ఫెన్సింగ్ వేస్తే దాన్ని తొలగించి మరీ.. హద్దు రాళ్లు పెట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కన్నారావుతో పాటు అతని అనుచరులు బీఆర్ ఎస్ నాయకులు 38 మందిపై 307,447, 427., 436,148,149 ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. 38 మందిలో ముగ్గురిని పోలీసులు రిమాండ్లోకి తీసుకోగా మరో 35 మంది పరారీలో ఉన్నట్టు తెలిపారు. కాగా కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో కన్నారావు బెంగుళూరులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.