Mission Divyastra was a success
మిషన్ దివ్యాస్త్ర సక్సెస్
– అగ్ని-5 ని విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ…
న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్- డీఆర్డీఓ తాజాగా మరో ఘనతను దక్కించుకుంది. పూర్తిగా భారత దేశ సాంకేతికతతో తయారు చేసిన మిషన్ దివ్యాస్త్రను మొదటిసారి విజయవంతంగా టెస్ట్ చేసింది. ఇది సక్సెస్ అయినట్లు డీఆర్డీఓ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఉన్న అగ్ని-1 నుంచి అగ్ని-4 వరకు ఉన్న మిస్సైల్స్ కంటే ఈ ‘అగ్ని-5 / Agni-5’ మిస్సైల్ మరింత దూరంలో ఉన్న లక్ష్యాలను మరింత ఖచ్చితత్వంతో చేరుకుంటుందని డీఆర్డీఓ అధికారులు స్పష్టం చేశారు.
ఇది మన దేశానికి అందుబాటులోకి రావడంతో భారత రక్షణ, ఆయుధ వ్యవస్థ మరింత బలోపేతంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు. ఈ సందర్భంగా ‘డీఆర్డీఓ/DRDO’ అధికారులకు ప్రధాని మోదీ..
అభినందనలు తెలియజేశారు. అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం భారతదేశం రక్షణ సంసిద్ధత, వ్యూహాత్మక సామర్ధ్యాలను పెంపొందించడంలో కీలక మైలురాయి అని మోదీ కొనియాడారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ శాస్త్రవేత్తలను చూసి గర్విస్తున్నామని మోదీ ట్వీట్ చేశారు. ఈ మిషన్ దివ్యాస్త్రను ‘మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్’ టెక్నాలజీతో అభివృద్ధి చేశారు.
ఈ మిషన్ దివ్యాస్త్రలోని ఒకే మిస్సైల్ సాయంతో అనేక వార్హెడ్లను వేర్వేరు లక్ష్యాలపై ఒకేసారి ప్రయోగించవచ్చని డీఆర్డీఓ అధికారులు వివరించారు. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అయిన అగ్ని-5కి 5 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను కూడా ఛేదించే సామర్థ్యం ఉంటుంది. మన పొరుగున ఉన్న చైనా వద్ద డాంగ్్ఫంగ్-41 వంటి మిస్సైల్స్ ఉన్నాయి.
Also Read : Check to China
డాంగ్ ఫెంగ్ మిస్సైల్స్ 12 వేల కిలోమీటర్ల నుంచి 15 వేల కిలోమీటర్ల వరకు ఉన్న లక్ష్యాలను ఛేదించగలవు. వాటిని దృష్టిలో ఉంచుకుని భారత్ ఈ అగ్ని-5 క్షిపణిని రూపొందించింది. అగ్ని-1 నుంచి అగ్ని-4 రకం వరకు ఉన్న మిస్సైల్స్ అన్నీ 700 కిలోమీటర్ల నుంచి 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేరుకుంటాయి. అవి ఇప్పటికే మన సైనిక బలగాల అందుబాటులో ఉన్నాయి. ఈ మిషన్ దివ్యాస్త్ర అతిపెద్ద అత్యాధునిక ఆయుధ వ్యవస్థ అని తెలుస్తోంది. అయితే ఈ టెక్నాలజీ కలిగిన దేశాలు ప్రపంచంలో చాలా తక్కువ సంఖ్యలో ఉండగా ఆ దేశాల సరసన ప్రస్తుతం భారత్ చేరింది.