ఆక్వా రైతులకు సీఎం జగన్ అండ..
హెరిటేజ్ కోసం సహకార సంస్థలను నాశనం చేశారన్న సీఎం జగన్
తాడేపల్లి (ప్రశ్న న్యూస్) ఆంధ్రప్రదేశ్ లో హెరిటేజ్ కు మేలు చేయడానికి ఏ సహకార సంస్థనూ సరిగ్గా నడవనీయని పరిస్థితులను గత ప్రభుత్వం సృష్టించిందని అన్నారు. అమూల్ ప్రవేశించిన తర్వాత రాష్ట్రంలోని డెయిరీలకు తప్పక ధరలు పెంచాల్సి వచ్చిందని అన్నారు. అమూల్ వచ్చాక లీటరుకు 5 నుంచి 15 రూపాయల వరకు అదనపు ఆదాయం వచ్చిందని గుర్తుచేశారు. రేట్ల పరంగా ఈ పోటీని కొనసాగించడం ద్వారా పాడిరైతులకు మరింత మేలు జరుగుతుందని సీఎం జగన్ అన్నారు.గతంలో సహకార రంగంలోని డెయిరీలను స్వప్రయోజనాలకు మళ్లించారని, కొందరు సహకార డెయిరీలను తమ ప్రైవేటు సంస్థలుగా మార్చుకున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేనద వ్యక్తం చేశారు. జగనన్న అమూల్ పాలవెల్లువ, మత్స్యశాఖపై సీఎం జగన్ తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. సహకార రంగాన్ని వ్యవస్థీకృతంగా ధ్వంసం చేశారని ఆరోపించారు. అలాగే మహిళల సుస్థిర ఆర్థికాభివృద్ధికోసం ఆసరా, చేయూత లాంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. తమ ఆదాయాలు పెంచుకునే మార్గంలో చాలా మంది మహిళలు పాడిపశువులను కొనుగోలు చేశారని తెలిపారు. వారికి మరింత చేయూత నివ్వడానికి బీఎంసీయూలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల పాడి వ్యాపారంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. బీఎంసీయూల నిర్వహణను పారదర్శకంగా చేపట్టాలని తెలిపారు.అన్ని విధాల మహిళలకు మేలు జరిగేలా చర్యలను చేపడుతున్నామని సీఎం జగన్ అన్నారు. పారదర్శక సహకార వ్యవస్థ ద్వారా మహిళలకు మేలు జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో మళ్లీ సహకార వ్యవస్థబలోపేతం కావాలని అన్నారు. చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలి సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య రూపొందించిన జగనన్న పాలవెల్లువ మహిళా డెయిరీ సహకార సంఘం- కార్యదర్శికి మార్గదర్శకాలు, జగనన్న పాలవెల్లువ-శిక్షణా కరదీపిక పుస్తకాలను సీఎం జగన్ ఆవిష్కరించారు.దీంతో పాటు మత్స్య శాఖపైనా సమీక్ష చేశారు. ప్రజలకు పౌష్టికాహారం అందించడమే కాదు, స్థానిక వినియోగాన్ని పెంచడంద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించేందుకు ఆక్వాహబ్లు, రిటైల్ వ్యవస్థలను తీసుకు వస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ఇది జరక్కపోతే సరిగ్గా పంట చేతికి వచ్చే నాటికి దళారులు సిండికేట్ అయ్యి రేట్లు తగ్గిస్తున్నారని అన్నారు. ప్రాసెసింగ్ చేసేవాళ్లు, ఎక్స్పోర్ట్ చేసేవాళ్లు సిండికేట్ అవుతున్నారని పలు దఫాలుగా రైతులు ఆరోపిస్తున్నారని తెలిపారు. దీనికి పరిష్కారంగా ప్రీప్రాసెసింగ్, ప్రాసెసింగ్, రిటైల్రంగాల్లోకి ప్రభుత్వం అడుగుపెడుతోందని పేర్కొన్నారు.పౌష్టికాహారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే కాదు, మత్స్య ఉత్పత్తులకు స్థానిక వినియోగాన్ని పెంచడం ద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించాలన్నదే లక్ష్యమని తెలిపారు. ఎగుమతులకు అవకాశం ఉన్న మత్స్య ఉత్పత్తుల పెంపకంపై అవగాహన, ప్రచారం, శిక్షణ కల్పించాలని తెలిపారు. రైతులను ఆదిశగా ప్రోత్సహించాలని సీఎం అధికారులను ఆదేశించారు.