revanth

పంపకాల్లో బీజేపీ, టీఆర్ఎస్‌ల‌ మధ్య గొడవ

— నమ్మకద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ – రేవంత్ రెడ్డి

🔹బొందిలో ప్రాణం ఉండ‌గా కేసీఆర్‌ని న‌మ్మం
🔹బీజేపీ, టీఆర్ఎస్‌లు తోడు దొంగలు
🔹నేడు తెలంగాణ వ్యాప్తంగా నిర‌స‌న‌లు..

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. నమ్మకద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ అని టీపీపీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రజలను మోసం చేయడంలో ఆరితేరిన ఘనుడని అని విమర్శించారు. తన రాజకీయ అవసరాల కోసం ఎంతకైనా దిగజారుతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నీడను కూడా కాంగ్రెస్ పార్టీ భరించదన్నారు. కాంగ్రెస్ పార్టీని 2004, 2014లో కేసీఆర్ నమ్మించి మోసం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరో సారి కేసీఆర్ మాటలు నమ్మి మోసపోతే తెలంగాణ ప్రజలు మమ్మల్ని క్షమించరని పేర్కొన్నారు. మా బొందిలో ప్రాణం ఉండగా సీఎం కేసీఆర్ ని నమ్మమని అన్నారు. పచ్చి రాజకీయ అవకాశవాది కేసీఆర్ అని ఆరోపించారు. తెలంగాణ ప్రజ‌లు కేసీఆర్‌ను బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ డ్రామాలు ప్రజలకు తెలుసన్నారు. రాహల్‌గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సభ్యసమాజం సిగ్గుపడేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ మాతృత్వాన్ని కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు. అస్సాం సీఎం వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డాలు స్పందించకపోవడం దారుణమని రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. అస్సాం సీఎంను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మచేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఖడించినంత మాత్రాన… కరిగే వారు లేరని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒకరినొకరు బ్లాక్ మెయిల్ చేసుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ నేతలకు పంపకాల్లో సమస్యలు వచ్చాయని అందుకే గొడవలు పడుతున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, బీజేపీకీ కాంగ్రెస్ పార్టీ సమాన దూరం అని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా నేడు అన్ని పోలీస్ స్టేషన్లలో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మపై ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.. రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు. సీఎం కేసీఆర్ మాటల్లో చిత్తశుద్ధి ఉంటే అస్సాం సీఎంపై కేసు నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. నిరసన నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు సంబరాలను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.