Telugu Akademi

 

తెలుగు అకాడమీ కేసు గోల్ మాల్ నిజమే

 

🔹10 మంది అరెస్ట్
🔹కస్టడీలోకి ఏ1 నిందితుడు

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో సీసీఎస్ పోలీసులు పురోగతి సాధించారు. స్కామ్‌కు పాల్పడిన ముఠాలోని పది మందిని అరెస్ట్‌ చేశారు. యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మస్తాన్‌వలీతో కుమ్మక్కై.. తెలుగు అకాడమీ డిపాజిట్లను కాజేశారు. ఈ జనవరి నుంచి స్కామ్‌కు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. కమీషన్‌ ఎర చూపించి.. బ్యాంక్‌, అకాడమీ సిబ్బందిని ముగ్గులోకి దింపారు. గతంలో ఈ ముఠా పలు స్కామ్‌లకు పాల్పడినట్లు తెలుస్తోంది. కేసు విచారణలో భాగంగా చంచల్‌గూడ జైలు నుంచి.. యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌, కేసులో ఏ1 నిందితుడు మస్తాన్‌ వలీని కస్టడీలోకి తీసుకుంటారు. మస్తాన్‌వలీని ఏడు రోజుల కస్టడీలోకి నాంపల్లి కోర్టు అనుమతించింది. అకాడమీ నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంపై మస్తాన్‌ను ప్రశ్నిస్తారు. అకాడమీకి చెందిన మూడు అకౌంట్ల నుంచి మళ్లించిన నిధులు ఎక్కడికి వెళ్లాయి.. ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీస్తారు.

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ వాస్తవమేనని.. త్రిసభ్య కమిటీ తేల్చింది. నిధుల గల్లంతుపై.. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అకాడమీలో అందరినీ విచారించిన కమిటీ సభ్యులు.. ఫైనల్‌ రిపోర్టును రూపొందించారు. డబ్బులు ఎలా బయటికి వెళ్లాయి..? నిధుల గోల్‌మాల్‌లో ఎవరెవరు ఉన్నారు..? వారి పేర్లతో సహా రిపోర్టులో పేర్కొన్నారు. 64 కోట్ల కుంభకోణం జరిగినట్లు గుర్తించిన త్రిసభ్య కమిటీ.. ఇక మీదట రెగ్యులర్ అకౌంట్స్ ఆఫీసర్‌తోపాటు రెగ్యులర్ డైరెక్టర్ ఉండాలని నివేదిక ఇచ్చింది. ఇదివరకు డైరెక్టర్‌గా పనిచేసిన సత్యనారాయణ, మొన్నటివరకు డైరెక్టర్‌గా ఉన్న సోమిరెడ్డి నిర్లక్ష్యం వల్ల అవకతవకలు జరిగాయని.. వారిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అకాడమీకి ఉన్న మూడు అకౌంట్ల నుంచి నిధులు దారి మళ్లాయని.. మరో 31 అకౌంట్లలో నిధులు సేఫ్‌గానే ఉన్నట్లు త్రిసభ్య కమిటీ తేల్చింది. 22 పేజీల నివేదికను సమర్పించింది. త్రిసభ్య కమిటీ రిపోర్టు ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోనుంటారు.  తెలుగు అకాడమీకి అన్ని బ్యాంకుల్లో కలిసి.. 340 కోట్ల నిధులు ఉన్నాయి. 64 కోట్ల రూపాయల డిపాజిట్లు దారి మళ్లాయి. కార్వాన్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి 43 కోట్లు.. సంతోష్‌నగర్‌ నుంచి 12 కోట్లు చందానగర్‌ అకౌంట్‌ నుంచి 10 కోట్లు గోల్‌మాల్‌ జరిగాయి. డిపాజిట్లను ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు విడతలవారీగా ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాకు మళ్లించి నగదును తీసుకున్నారు. తెలుగు అకాడమీ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు.. అటు ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన త్రిసభ్య కమిటీ సభ్యులు మొత్తం వ్యవహారంపై కూపీ లాగారు.