jagan

 

బద్వేలు ఉపఎన్నికపై జగన్ కీలక ఆదేశాలు

 

🔹బద్వేలు ఉపఎన్నికలో భారీ మెజార్టీతో వైసీపీ గెలుపు – సుధ
🔹గతం కంటే భారీ మెజార్టీ రావాలన్న జగన్
🔹బద్వేలు ఉపఎన్నిక ఇంఛార్జీగా మంత్రి పెద్దిరెడ్డి

 

అమరావతి (ప్రశ్న న్యూస్) వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే బద్వేల్‌ ఉప ఎన్నికలో తనను గెలిపిస్తాయని ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధ ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేస్తామన్నారు.ఇప్పటికే బద్వేల్‌ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం 4 వందల కోట్లు కేటాయించారని తెలిపారు సుధ. బద్వేల్‌ మున్సిపాలిటీకి 120 కోట్లు కేటాయించారన్నారు. 2019 ముందు బద్వేల్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. ఈ రెండేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కంటే ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీ సంపాధిస్తామన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ కాగ్రెస్‌ పార్టీ తరపున గెలుపొందిన బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి 28 న మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో దివంగత డాక్టర్‌ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్‌ దాసరి సుధను పార్టీ అధిష్టానం బద్వేలు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. కాగా, బద్వేల్ ఉప ఎన్నికపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లిలో క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. దివంగత వెంకటసుబ్బయ్యగారి భార్య దాసరి సుధ కూడా డాక్టరేనని, తమ పార్టీ తరఫు నుంచి ఆమెను అభ్యర్థిగా నిలబెడుతున్నామన్నారు. బద్వేల్‌ నియోజకవర్గ బాధ్యతలన్నీ సమావేశానికి వచ్చిన వారందరి మీద ఉన్నాయన్నారు. నామినేషన్‌ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలన్నారు. 2019లో దాదాపు 44వేలకుపైగా ఓట్ల మెజార్టీ వచ్చిందని సీఎం జగన్‌ గుర్తు చేశారు. గతంలో వెంకసుబ్బయ్యకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ డాక్టర్‌ సుధకి రావాలని తెలిపారు. ఎక్కడా అతి విశ్వాసం ఉండకూడదని, కష్టపడి ప్రజల ఆమోదాన్ని పొందాలని స్పష్టం చేశారు. 2019లో 77శాతం ఓటింగ్‌ జరిగిందని, ఓటింగ్‌ శాతం పెరగాలని సూచించారు. అందరూ ఓట్లు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలని సీఎం జగన్‌ తెలిపారు. ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రతి మండలం కూడా బాధ్యులకు అప్పగించాలని, గ్రామస్థాయి నాయకులతో కలిపి ప్రచారం నిర్వహించాలని తెలిపారు.

బద్వేల్‌ ఉప ఎన్నికకు పార్టీ ఇంఛార్జిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారని స్పష్టం చేశారు సీఎం జగన్. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలుపెట్టాలని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో తెలియజేయాలని మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం నిర్దేశించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి (మైనార్టీ వ్యవహారాలు) అంజాద్‌ బాషా, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని), ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. కాగా బద్వేలు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం విదితమే. అక్టోబర్‌ 1 న ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్‌ నెల 8 తేదీ నామినేషన్ల ప్రక్రియకు చివరి తేదీగా నిర్ణయించారు. 11న నామినేషన్ల పరిశీలన ఉండగా 13న ఉపసంహరణకు గడువు నిర్ణయించారు. అక్టోబర్‌ 30న పోలింగ్‌ నిర్వహిస్తారు. నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా, టీడీపీ నుంచి ఈ ఉపఎన్నికలో వైసీపీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.